భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానానికి జాన్సన్ అంగీకారం తెలిపినట్లు డౌన్స్ట్రీట్ మంగళవారం ప్రకటించింది. భారత్ పర్యటనను ఖరారు చేయడం ద్వారా గతేడాది బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బోరిస్.. తొలిసారి చేపట్టనున్న అతిపెద్ద ద్వైపాక్షిక పర్యటన ఇదే కానుంది. బ్రెగ్జిట్ అమలులోకి వచ్చిన తర్వాత బోరిస్ చేపడుతున్న పెద్ద పర్యటన కూడా ఇదే.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఓ కీలక దేశంగా బోరిస్ పేర్కొన్నారు. కొత్త సంవత్సరాన్ని ఈ పర్యటనతో గొప్పగా ఆరంభించబోతున్నట్లు తెలిపిన జాన్సన్.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఎత్తులకు చేర్చుతుందని అభిలషించారు. ఈ పర్యటనలో ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్య, వాతావరణ మార్పులు తదితరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాయి.