అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. భారత ప్రధాని నరేంద్ర మోది విజ్ఞప్తి మేరకు జూన్ 21న యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 197 దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ కేంద్రంగా ఎన్కన్వెన్షన్ సెంటర్లో యోగా దినోత్సవాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యోగా మనందరి జీవన శైలిలో భాగమని, పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద అని వివరించారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా యోగాసనాలు వేశారు. అందరికంటే చాలా వేగంగా ఆసనాలు వేస్తూ అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇది చూసిన మంతులు, అధికారులు అవాకయ్యారని సమాచారం. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు అధికార, అనధికార ప్రముఖులు యువతీ,యువకులు పాల్గొని యోగా చేశారు.
ఇదంతా ఏమో కానీ చంద్రబాబుకు యోగా దినోత్సవం సందర్భంగా కొంచెం మనశ్శాంతి దొరికిందనే చెప్పాలి. ఇన్ని రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యవహార ఒత్తిడిలో రోజూ కేబినెట్ మీటింగ్స్ ,న్యాయవాదులతో మీటింగ్స్ పెట్టుకుంటూ చాలా ఒత్తిడిలో ఉండేవారు. ఈరోజు వాటన్నిటికి దూరంగా ఉండి కాస్త ఉత్సాహంగా కనిపించారు.