రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ పార్థివ దేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రి వైద్యులు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యిన సంగతి తెలిసిందే.
భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వైద్యులు అందజేశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాదుకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా… రూట్ క్లియరెన్స్ ఇచ్చారు.
హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పార్థీవ దేహాన్ని మధ్యాహ్నంలోగా హైదరాబాద్ తరలిస్తారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియగానే ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హుటాహుటిన నార్కెట్ పల్లి బయల్దేరి వెళ్లారు. తండ్రి మృతదేహాన్ని చూసి వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు.