ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి. జీవో మెంబర్ 80ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టనుంది. పాయింట్ల పద్ధతిలో జరిమాన విధించనున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ట్రాఫిక్ ఉల్లంఘనులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తూ జీవో జారీ చేసింది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయబోతోంది. వాహనదారుల్లో బాధ్యత పెంచేందుకు రూల్స్ను కఠినతరం చేసినట్లు అధికారులు అంటున్నారు.హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మెట్ లేకపోతే 2 పాయింట్లు, అతి వేగానికి 3 పాయింట్లు, మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే 5 పాయింట్లు ఇలా ఒక్కో ఉల్లంఘనకు కొన్ని పాయింట్లు ఇస్తారు. 12 పాయింట్లు పూర్తైతే ఆ వ్యక్తి లైసెన్స్ ఏడాది పాటు రద్దు చేస్తారు.
విదేశాల్లో అమలులో ఉన్న ఈ విధానం అమలుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేయబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ తర్వాత కూడా ఉల్లంఘిస్తే మళ్లీ పాయింట్లు కౌంట్ అవుతాయి. రెండోసారి పట్టుబడితే క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించబోతున్నారు. ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించడం కూడా ఇకపై కుదరదు. పోలీసుల వద్ద ట్యాబ్లో సదరు వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది.