ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతన్నాయనే ప్రతిపక్షాల ఆరోపణలకు సీఈసీ షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లను వాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా ఇటీవల చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాల ఓటింగ్ను నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా స్పష్టం చేశారు.
మన దేశంలో ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానమే లేనపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఎందుకు వినియోగించాలని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే. ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అనడం విడ్డూరంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.