టీటీడీ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. 65 సంవత్సరాలు దాటిన ప్రధాన పూజారులను తొలగించాలన్న పాలక మండలి నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, జీవో 76 అమలు చేస్తున్నామని ప్రభుత్వం లీకులిస్తోందని ఆరోపించారు. దేవాదాయ చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చంద్రబాబుకి సమయం లేకుండా పోయిందన్నారు.
1986 దేవాదాయ చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. దీని వల్ల చిన్న చిన్న ఆలయాలు మూతపడ్డాయని తెలిపారు. 2007లో ఈ చట్టాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సవరించారని వెల్లడించారు. 1986 చట్ట సవరణతో మిరాశీ పోయిందని, 2007 చట్ట సవరణతో మరోసారి మిరాశీ అంశంపై స్పష్టంత వచ్చిందన్నారు. దీనిని అర్ధం చేసుకోవడానికి ముఖ్యమంత్రికి సమయం లేకుండా పోయిందన్నారు.
చంద్రబాబు తాను పనిచేయడం కన్నా.. చేస్తున్నాననే దానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బ్రాహ్మణులతో బ్రాహ్మణులతో తిట్టించాలనే పాలసీలని పెట్టుకున్నారన్నారు. కరుడుకట్టిన కులస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆగమ పరీక్షలో ఫెయిలైన వారిని ప్రధాన అర్చకుడిగా నియమిస్తారా అని ప్రశ్నించారు.