శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ ప్రభుత్వం విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణను ఎత్తివేస్తూ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తనపై నగర బహిష్కరణ సరికాదని, అది వ్యక్తిగత స్వేచ్ఛకు కలిగిస్తోందని ఆరోపిస్తూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు నెల రోజుల కిందట స్వామి పరిపూర్ణనందపై ఆరు నెలలు నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తిమహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు పరిపూర్ణానంద స్వామి చేపట్టిన పాదయాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. కొద్దిరోజుల తర్వాత ఆయనపై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేశారు. గతేడాది ఓ సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. అందువల్లే బహిష్కరణ విధిస్తున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అనంతరం ఆయన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు తరలించారు.
గతంలో ఓ ఛానల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వాటిని నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు ప్రయత్నించారు. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. మరోవైపు కత్తి మహేశ్ను కూడా నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.