ఎక్కడన్న తేనెతుట్టే కనిపిస్తే కుర్రాళ్లు దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే మనం హెచ్చరించి వద్దు అని చెబుతాం. ఎందుకంటే అవి దాడి చేస్తే చివరికి ప్రాణాలు పోయేంత ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కసారి తుట్టెను కదిలిస్తే ఇక పరుగు పెట్టాల్సిందే. వాటి దాడి నుంచి మనం తప్పించుకున్నా మన కంటే వేగంగా తేనేటీగలు వచ్చి దాడి చేస్తాయి. అందుకే వాటి వద్ద జాగత్రగా ఉండాలి. ఈ కష్టాలు సామాన్యులకు సర్వసాధారణం. అయితే హైదరాబాద్లో తేనెటీగలు ఓ ఎమ్మెల్యేను, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేలా చేసింది.
హైదరాబాద్ అంబర్పేట్ బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 3) తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం పర్యటించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆయన వెంట ఉన్నారు. బాగ్అంబర్పేట్ వైభవ్నగర్లోని పార్క్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనుల పరిశీలనకు ఎమ్మెల్యే కిషన్రెడ్డితో పాటు అధికారులు వెళ్లారు.
అయితే ఆ సమయంలో ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలకు ఎమ్మెల్యే, మంత్రి అని ఎవరూ సంబంధం లేదు కదా. తమ విశ్వరూపం చూపిస్తూ దాడికి పాల్పడ్డాయి. తేనెటీగలతో దాడితో అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ ఈఈ, డీఎంసీతో పాటు ఇతర అధికారులకు గాయాలయ్యాయి.