యాదాద్రిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.తమ ప్రేమ గురించి తెలిసిపోయిన పెద్దలు.. తమను పట్టుకుంటారేమోననే భయంతో ఓ ప్రేమ జంట మూడంతస్థుల భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయాలపాలయిన వారిని అసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెలితే….సికింద్రాబాద్ ఆల్వాల్లో ఉంటున్న మనీష్ (21), అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక దగ్గర బంధువులు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మనీష్ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కుమార్తెకు పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ఇద్దరూ మనసు మార్చుకోలేదు. పెద్దలను వ్యతిరేకించి పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి గత నెల 27న ఇంట్లో నుంచి పారిపోయారు.కుమార్తె అదృశ్యంపై తండ్రి అల్వాల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మంగళవారం యాదగిరి గుట్టకు వచ్చిన ప్రేమ జంట అక్కడి చక్ర సముదాయంలో అద్దె గది కోసం యత్నించింది. గుర్తింపు కార్డు లేనిదే గది ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఇద్దరూ కాసేపు అక్కడే తచ్చాడారు. మరోవైపు అమ్మాయి తండ్రి, బంధువులు యాదాద్రికి చేరుకుని..వారి కోసం వెదకడం ఆరంభించారు.
ఒకవైపు ఎక్కడ ఉండాలో అర్థంకాని పరిస్థితి, మరోవైపు తమ కోసం వెతుకున్నారన్న సమాచారం తెలియడంతో ఆందోళనకు గురైన ప్రేమ జంట శ్రీచక్ర సముదాయంపైకెక్కి కిందకి దూకేశారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని 108 అంబులెన్స్లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు.