ప్రపంచ పారిశ్రామిక వేత్తల భాగస్వామ్య సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం భారత సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడడంతో ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో దాని దృష్టి మరల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఓ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజుల పాటు ప్రపంచ మిఠాయి ఉత్సవం నిర్వహించాలని డిసైడైపోయింది.
నోరూరించేలా అంతర్జాతీయ మిఠాయిల ఉత్సవం (ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్) ను భాగ్యనగరంలో జనవరి 13, 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాడ్ పెరేడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవానికి వేదిక కానుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కూడా తెలిపారంట.
ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్లో దాదాపు వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి భాగ్యనగర్ వాసులకు కొత్తకొత్త మిఠాయిలను పరిచయం చేయనున్నారు. దుకాణాలు, హోటళ్లు, బేకరీల నుంచి తెచ్చిన వాటిని కాకుండా…సొంతంగా తయారు చేసిన పదార్థాలను ఉత్సవాల్లో ప్రదర్శనకు అనుమతి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించనున్నారు. విదేశీయులు, హైదరాబాద్లో స్థిరపడిన మార్వాడీ వాళ్లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొనే మహిళలు..వారి కుటుంబ సభ్యులు ఇక్కడే పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడంతో పాటు..విక్రయించుకోవచ్చు. ఒక్కో స్టాల్లో ఐదు నుంచి 10 రకాల ఐటమ్స్ ను షాపుల్లో కంటే తక్కువ ధరకు అమ్ముతారు.
పిండివంటల్లో ఫేమస్ అయిన వారిని గుర్తించేందుకు వీలుగా పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం (డిసెంబర్-23) హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో కేటరింగ్ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పిండి వంటల తయారీలో గుర్తింపు పొందిన మహిళలు, కుటుంబాలను గుర్తించి…వారితో స్టాళ్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఇలాంటి ఫెస్టివల్ ను నిర్వహించడం దేశంలోనే మొదటి సారి అని తెలిపారు వెంకటేశం. ఇదే తేదీల్లో నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు 140 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని… వారికి భారతీయ వంటలు రుచి చూసే అవకాశం కలుగుతుందన్నారు. అంతే కాదు స్వీట్స్ రూపంలో చారిత్రాక ప్రదేశాలు, కట్టడాలు, పురావస్తు, ఉద్యానవన, పోలీసుతో పాటు ప్రభుత్వ కట్టడాల చిహ్నాలు ప్రదర్శిస్తాయన్నారు.