- సినీ రంగం నుంచి పలువురికి ఆహ్వానం
ప్రపంచ సదస్సులో సినీ మెరుపులు మెరుస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామికవేత్తల సరసన మన తెలుగుతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్లోని హెచ్ ఐసీసీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ సదస్సుకు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.
తెలుగు గడ్డపై ప్రపంచ సదస్సు జరుగుతుండడంతో అదే తెలుగు పరిశ్రమకు చెందిన సినీనటుడు రామ్చరణ్తేజ, దగ్గుబాటి సురేశ్బాబు, బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, అదితీరావు తదితరులకు ఆహ్వానం అందింది. చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొనేటట్టు కనిపిస్తోంది. అయితే అక్కినేని కోడలు సమంత కూడా ఇవాంకా ట్రంప్ను కలవనున్నట్టు సమాచారం. ఎందుకంటే సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహిరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాంకాకు ఇస్తున్న కానుకలను సమంతను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగానే కానుకలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సు ప్రచార కార్యక్రమాల్లో మంచు లక్ష్మీప్రసన్న కూడా పాల్గొంటూ సందడి చేస్తోంది.