రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జనసేన అధ్యక్షుడు పవన్ పోరుబాట పట్టనున్నాడు. ఈనెలం 20నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఉద్యమాల పుట్టినిల్లయిన శ్రీకాకుళం నుంచే తమ యాత్ర ప్రారంభమవుతుందని, 45 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు.
ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నానని జనసేనుడు తెలిపారు. గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్ తెలిపారు.
అలాగే సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా అన్ని నియోజక వర్గాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామని పవన్ అన్నారు. మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని, బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు.