ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడి అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. మ్యాప్ను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో, పార్టీదో కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. పనిలో పనిగా బాబుకు షాక్ తగిలే విధంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి సంబందించిన లెక్కలు చెప్పకపోవడంతోనే నిధులు ఇవ్వడంలేదన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు విషయంలో కేంద్రం లెక్కలు అడుగుతోందని అవి చెబితే తప్పేమిటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని అనుమానాలు వచ్చాయని, దాంతో లెక్కలు అడుగుతున్నారని, మనం ఏ తప్పు చేయనప్పుడు లెక్కలు చెబితే తప్పేమిటని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లెక్కలు చెబితే, శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పటికీ కేంద్రం స్పందించకుంటే పోలవరం ప్రాజెక్టుపై నేను కూడా మీతో కలిసి వస్తానని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం పోలవరంపై నిజాలు చెప్పకపోవడంతో నాకుకూడా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 2018 నాటికి పోవలరం పూర్తి కాదన్నారు.