రైతులందరికీ ఆనందం ఇచ్చే వార్త. వచ్చే నైరుతి సీజన్పై ఆందోళన అక్కర్లేదని తెలిపింది అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ యేడు ఎల్నినో పరిస్థితులు లేవని, లానినా పరిస్థితులతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఆ ఏడాది రుతుపవనాలు అంతగా ప్రభావం చూపవు. వర్షాలు అరకొరగా కురుస్తాయి. దీనినే ఎల్నినోగా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నట్లయితే రుతుపవనాల సీజన్లో వానలు బాగా కురుస్తాయి. దీనిని లానినాగా పేర్కొంటారు. ఎల్నినో ఏర్పడుతోందంటే రైతాంగంతోపాటు వ్యాపార వాణి జ్య, ఆర్థికరంగాలు ఆందోళన చెందుతాయి. ఎల్నినో,లానినా ల ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై రుతుపవనాలకు ఆరేడు నెలల ముందునుంచే వాతావరణ సంస్థలు, నిపుణులు అంచనాలు వేస్తుంటారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులుండ వచ్చంటూ వాతావరణ సంస్థలు కొన్నాళ్లుగా అంచనా వేస్తున్నాయి. పసిఫిక్లో ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగానే ఉండటంతో లానినా ఏర్పడి రానున్న రుతుపవనాల సీజన్లో వానలు సంతృప్తికరంగా కురుస్తాయని, కరువు పరిస్థితులకు ఆస్కారం లేదని తేల్చాయి.
ఐఎండీ తాజా లెక్కల ప్రకారం రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లానినా ప్రభావం బాగా ఉండనుంది. ఆ తర్వాత మరో మూడు నెలలు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణంగా ఉంటుంది. అంటే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే మే వరకు లానినా అనుకూలంగా ఉండడంతో సకాలంలో రుతుపవనాల వస్తాయని చెబుతున్నారు. తర్వాత వచ్చే మూడు నెలలపాటు సాధారణ (న్యూట్రల్ లానినా) పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో సాధారణ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రకటనతో రైతులతోపాటు వ్యాపార, వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.