తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం. కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హుటా హుటిన ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ఇంకా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు.
ఇవాళ మధ్యాహ్నం దయాళు అమ్మాళ్ ఆరోగ్యం పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కరుణానిధి రెండవ భార్య, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తల్లి దయాళు అమ్మాళ్కు మరో ఇద్దరు కుమారులు ఎంకే అళగిరి, ఎంకే తమిళరసు, కుమార్తె ఎంకే సెల్వి ఉన్నారు. డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే ఆమె అస్వస్థతకు గురికావడం గమనార్హం.
మంగళవారం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే. స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే. స్టాలిన్ తన తండ్రి దివంగత నేత ఎం. కరుణానిధి సమాధి దగ్గరకు చేరుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
తండ్రి బతికుండగానే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంకే అళగిరి నుంచి స్టాలిన్కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తనను పార్టీలోకి తీసుకోకుంటే ‘‘తీవ్ర పరిణామాలుంటాయని’’ అళగిరి హెచ్చరిస్తుండగా… తనకు సోదరుడే లేడంటూ స్టాలిన్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.