దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్యం కుదట పడింది. సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారని, సర్జరీల తర్వాత మధులిక కళ్లు తెరిచి చూసిందని వైద్యులు చెప్పారు. వైద్యానికి మధులిక శరీరం సహకరిస్తోందని డాక్టర్లు తెలిపారు.
దాడి జరిగినప్పటి నుంచి మధులిక స్పృహలో లేదు. శ్వాస తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధులికకు మైనర్ ఆపరేషన్తోపాటు.. ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. ఐదుగురు వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని, ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందన్నారు. మధులికకు ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని చెప్పారు. నాలుగు సర్జరీలు చేశారు కాబట్టి ఆమె పూర్తిగా కోలుకోడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.
2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బర్కత్పురలో కాలేజీకి వెళుతున్న సమయంలో మధులికపై భరత్ అటాక్ చేశాడు. కొబ్బరిబోండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. మధులిక శరీరంపై 14 బలమైన కత్తి పోట్లకు గురయిన సంగతి తెలిసిందే.