కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష వ్యవహారం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందు నుయ్యి.. వెనకగొయ్యిగా తయారైనట్టు కనిపిస్తోంది. ముద్రగడ డిమాండ్ల విషయంలో ఏదీ తేల్చకపోతుండడంతో.. దీక్ష వ్యవహారం రోజురోజుకూ సీరియస్ గా మారుతోంది. ఇందుకు తగ్గట్టు.. ఆయన ఆరోగ్యం కూడా విషమిస్తున్నట్టు కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ముద్రగడ 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నట్టు.. ఆయన వియ్యంకుడు సోమేశ్వర్ రావు చెప్పారు. ముద్రగడ భార్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు.
అంతే కాదు.. ముద్రగడ చేత దీక్ష విరమింపజేస్తేనే మంచిదని డాక్టర్లు కూడా సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉన్న మాట నిజమే అయి ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది. మరోవైపు.. కాపు గర్జన సందర్భంగా తుని అల్లర్ల ఘటనకు కారణమయ్యారని ఆరోపిస్తూ.. పోలీసులు అరెస్ట్ చేసిన 13 మందిని విడుదల చేయాలని ముద్రగడ గట్టిగా పట్టుబడుతున్నారు. వారిని విడుదల చేసే వరకూ.. దీక్ష ఆపేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.
దీంతో.. ముద్రగడ ఆరోగ్యాన్ని మామూలు స్థితికి తేవడం ఎలాగన్న సమస్యతో పాటు.. ఆ 13 మందిని జైలు నుంచి విడుదల చేస్తే.. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అన్న విషయంపై.. చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చి.. సమస్యను పరిష్కరించుకోవడంపైనే.. బాబు ప్రభుత్వం కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
