Friday, May 10, 2024
- Advertisement -

భారత సైన్యాన్ని ఎదిరించే శక్తి మీకు లేదు: కాశ్మీర్ యువతకు రావత్ హెచ్చరిక

- Advertisement -

ఆజాద్ కశ్మీర్ పేరుతో యువత ఆయుధాలు చేపట్టడం సరికాదని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హితవు పలికారు. రాళ్లదాడులకు పాల్పడి మనుషులు ప్రాణాలు తీస్తున్నవారికి ఎన్నటికీ స్వాతంత్ర రాబోదనే విషయాన్ని కశ్మీరీ యువత తెలుసుకోవాలని సూచించారు.

భారత సైన్యాన్ని ఎదిరించే శక్తి వారి వద్ద లేదని అన్నారు. ఆజాదీ అంటూ వీధుల్లోకి వచ్చే వారిని నిలువరించేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారు కోరుకునే స్వాతంత్రం లభించే పరిస్థితులు లేవని అన్నారు. అమాయకులను చంపి, తామేదో సాధించామని భావించడం పొరపాటని హితవు పలికారు. ఇలాంటి పోరాటాల వల్ల సాధించేదీ ఏమీ ఉండదని, సైన్యంతో పోరాడే శక్తి మీకు లేదని వేర్పాటువాదులను పరోక్షంగా విమర్శించారు.

ఉగ్రవాద సంస్థలు కొత్తవారిని చేర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయని, యువత మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోవద్దని ఆయన తెలియజేశారు. ఎన్‌కౌంటర్లలో ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టామనేది ఆర్మీకి ముఖ్యం కాదని, ఈ లెక్కలను తామెన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. అలాగే ప్రాణాలు తీయాలనే ఉద్దేశం తమకు ఉండదని, ఆయుధాలతో ఎవరు కనిపించినా, ముందుగా లొంగిపోవాలనే హెచ్చరిస్తామని స్పష్టం చేశారు. అవతలివైపు నుంచి కాల్పులు జరిపే వరకూ తాము ఆయుధాలను వాడబోమని వివరణ ఇచ్చారు.

పాకిస్థాన్, సిరియాల్లో ఉన్న సైన్యం మాదిరిగా భారత సైన్యం లేదని చాలా సంయమనంతో వ్యవహరిస్తుందని తెలిపారు. సిరియా, పాకిస్థాన్ లలో ఇటువంటి పరిస్థితే ఉండగా, అక్కడి ప్రభుత్వాలు, సైన్యం ట్యాంకులు, యుద్ధ విమానాలను వాడుతోందని గుర్తు చేసిన రావత్, కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత దిశగా ఇంతవరకూ ఒక్కసారి కూడా యుద్ధ విమానాన్ని వాడలేదని అన్నారు. ఇక్కడి యువతలో కోపముందన్న సంగతి తనకు తెలుసునని, హింసా మార్గంలో వెళితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతిని మరువరాదని హితవు పలికారు

ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించే సమయంలో పెద్ద సంఖ్యలో జనం చేరి ఎందుకు తమ కార్యకలాపాలకు భంగం కలిగిస్తున్నారో అర్థం కావడం లేదు.. ఎవరు వారిని ప్రోత్సహిస్తున్నారు? తీవ్రవాదులు చావరాదని భావిస్తే, వాళ్లే వెళ్లి వారిని ఆయుధాలు లేకుండా బయటకు రప్పిస్తే ఎవరూ హతమార్చరని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -