ఈ కాలంలో ఒక్క పెళ్లితోనే జీవితం సరిపోయిందిరా నాయనో అనుకుంటున్న సమయంలో ఓ యువకుడు తాను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఒకే పెళ్లి మండపంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ యువకుడు విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్. ఉట్నూర్ మండలం ఘనపూర్కు చెందిన అర్జున్ టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన మేనత్త కూతుళ్లను గత మూడేళ్లుగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపించాడు. అయితే పెళ్లి చేసుకోవాలని ఆ యువతులు పట్టుపట్టడంతో అసలు విషయం పెద్దల ముందు ఉంచాడు. ఇక సదరు పెళ్లికొడుకు కోరిక విన్న పెద్దలు ముందుగా ఆశ్చర్యపోయారు.
మొత్తానికి అర్జున్ ప్రతిపాదన విన్న మూడు కుటుంబాలు గ్రామపెద్దలను ఆశ్రయించాయి. ఇక గ్రామ పెద్దలు కూడా ఇద్దరు యువతుల అభిప్రాయాలు తెలుసుకొని అంగీకరించారు. ఈ నెల 14న ఘనపూర్లో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జున్, ఉషారాణి, సూర్యకళ పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యులు.