ఆదిలాబాద్ అడవుల్లో ఆపిల్ సాగుకు అవకాశం
ఆపిల్ పండు అంటే జమ్ముకశ్మర్ గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ యాపిల్ కూడా రానుంది. కశ్మర్ సరసన తెలంగాణ యాపిల్ కూడా నిలవనుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్ మండలాల్లో ఆపిల్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు చాలా అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని తేల్చిచెప్పారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే ఇక్కడి భూములు యాపిల్ సాగుకు అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ బయాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యాపిల్ సాగుకు ఆదిలాబాద్ రైతులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం ఇచ్చే తోటగా యాపిల్ ఉండడంతో రైతులు ఈ సాగుపై శ్రద్ధ పెడుతున్నారు.భవిష్యత్తులో ఎండలను తట్టుకోవడానికి ఆపిల్ సాగు చేస్తున్న తోటల్లో పూర్తిగా పచ్చదనంతో ఉండి అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు ఆరోగ్యంగా ఎదగడం రైతులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.అంతా అనుకున్నట్లు జరిగితే 2019లో తెలంగాణ రాష్ట్రంలో పండించిన “కొమరం భీమ్”, “నాగోబా” ఆపిల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ అడవి బిడ్డల కృషితో తెలంగాణ యాపిల్ రానుంది.