చైనా, పాకిస్థాన్లు మిత్రదేశాలు. భారత్ అభివృద్ధిని అడ్డుకొనేదానికి దుష్ట ప్రణాలికలు పన్నుతూనే ఉంటారు. ఉగ్రవాద విషయంలో పాక్మీద ఈగ కూడా వాలనీయకుండా వెనుకేసుకొస్తోంటుంది డ్రాగన్ కంట్రీ. అయితె తాజాగా డ్రాగన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది పాక్.
పీఓకే మీదుగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఆ దేశం ఆఫర్ను పాక్ తిరస్కరించింది. సీపీఈసీలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో డైమర్-భాష డ్యామ్ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ముందుకురాగా.. పాక్ అందుకు నిరాకరించింది.
సీపీఈసీ ప్రాజెక్టును చైనా 60 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టునుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యాంను తామే కట్టుకుంటామని పాకిస్తాన్ నేరుగా చైనాకు చెప్పిందని తెలుస్తోంది. పీఓకే వివాదాస్పద ప్రాంతం కావడంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థలు రుణాలను ఇచ్చేందుకు నిరాకరించాయి.
దీంతో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. అయితె కఠినమైన షరతులు పెట్టడంతోపాటు 5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాక్ షాక్ అయ్యింది. షరతులు ఏమాత్రం అంగీకార యోగ్యంగా లేవని ప్రాజెక్టును సొంతంగా చేపడతామని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్ వాటర్, విద్యుత్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ముజామిల్ హుస్సేన్ స్పష్టం చేశారు.
ఈప్రాజెక్టుపై పాక్ తాజా నిర్ణయంతో చైనా బిత్తరపోయింది. తమను సంప్రదించకుండా ప్రాజెక్టును పాక్ ఇలా ఊహించని ఝలక్ ఇస్తుందని తాము అనుకోలేదని చైనా వర్గాలు అంటున్నాయి. ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు తమ దేశ ప్రయోజనాలకు భంగకరమని పాక్ అధికారులు చెబుతున్నారు.