పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవితకాలం ఆయన ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్ సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం షరీఫ్ను జీవితకాలం నిషేధించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని ఈ చారిత్రక తీర్పు సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
నవాజ్ షరీఫ్తో పాటు పాకిస్తాని తెహ్రీక ఇన్సాఫ్ (పీటీఐ) సెక్రటరీ జనరల్ జహంగీర్ తరీన్పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్ సుప్రీం బెంచ్ గత ఏడాది జులై 28న నవాజ్ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఇది పాక్ రాజకీయ వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.