సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఆడపిల్లలపై వివక్ష మాత్రం తగ్గడంలేదు. అమ్మాయిలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఏరంగంలో చూసుకున్నా అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. అయినా వారిపట్ల తల్లిదండ్రులే చిన్నచూపు చూస్తున్నారు.
అనాదిగా మన సమాజంలో మగపిల్లలకే తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సందర్బాల్లో మగపిల్లల కన్నా ఆడపిల్లలే నయమని ఎన్నో సంఘటనలు నిరూపిస్తోన్నా ఆడపిల్లలపై వివక్ష ఇంకా చాలా చోట్ల కొనసాగుతోంది. ఆడపిల్ల పుట్టిందంటేనే కొందరు తల్లిదండ్రులు శాపంగా భావిస్తున్నారు. పురిట్లోనే వాళ్లను చిదిమేస్తూ ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు.
ఇటువంటి సంఘటనలే తరుచూ జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ పసిపాపను కాలువలో పడేసి వెళ్లిపోయారు. మురికికాలువలో ఆ శిశువు మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ పాప చేతికి ఉన్న ట్యాగ్పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నట్లు గుర్తించారు.