కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్)లో బుధవారం (డిసెంబర్ 20) అర్ధరాత్రి మానసిక స్థితి సరిగ్గా లేని ఓ రోగి హల్చల్ చేశాడు. మిమ్మల్నందర్నీ చంపేస్తా.. ఎవర్నీ వదలను అని గ్లూక్లోజ్ పెట్టే స్టాండ్ పట్టుకొని ఆస్పత్రిలో నానా బీభత్సం సృష్టించాడు. అతడి భయానికి కుటుంబ సభ్యులు, రోగులు, వైద్యులు, సిబ్బందిని పరుగులు పెట్టారు. గోడలు దూకి పారిపోయి.. మంచాల కింద దాక్కోవడం.. గదుల్లో తలదాచుకొని… వంటివి చేస్తూ అతడి బారి నుంచి బయటపడ్డారు. మొత్తం కిక్ సినిమాలో అలీగా ప్రవర్తించాడు. అతడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి తంటాలు పడ్డారు. సాటి రోగులను రక్షించే క్రమంలో రోగి తల్లి ప్రాణత్యాగానికి ఒడిగట్టింది.
రాజమహేంద్రవరానికి చెందిన ఎస్.వీరేంద్ర (21) టైల్స్ పని చేస్తుంటాడు. అతడికి మానసిక స్థితి సరిగా లేదు. తల్లి మణి అతడిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది. యజమాని తనకు అన్నంలో విషం కలిపి పెట్టాడని, తాను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని ఇటీవల తల్లికి అతడు చెప్పాడు. గతంలో కూడా ఇలా చేయడంతో పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె ఈరోజు రేపు అంటూ వాయిదా వేస్తుండేది. ఆ విధంగా ఆమె చేయడంతో తల్లి అని కూడా వీరేంద్ర చావబాదాడు. దీంతో ఆమె తన రక్షణ కోసం బంధువులైన ఇద్దరు యువకులను కాపలాగా ఉంచి ఆమె నిద్రపోయింది. వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితి ఎంతకు తగ్గకపోవడంతో సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) తీసుకొచ్చింది. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బుధవారం అర్థరాత్రి లేచి బీభత్సం సృష్టించాడు. రోగులపై దాడి చేస్తూ చంపేస్తానని వైద్యులు, సిబ్బందితో పోట్లాడారు. దీంతో ఆస్పత్రి అంతా ఖాళీ అయ్యింది. తల్లి ప్రాణభయంతో మంచం కిందకు దూరడంతో గమనించిన వీరేంద్ర.. అమ్మా నువ్వు బయటకు రాకపోతే అందర్నీ చంపేస్తానని చెప్పాడు.
దీంతో తల్లి మణి అందరి కోసం తాను బలవడానికి సిద్ధమైంది. బయటకు రావడంతో వీరేంద్ర తల్లి తలపై గ్లూక్లోజ్ పెట్టే రాడ్తో బలంగా కొట్టాడు. రెండు, మూడు సార్లు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చేరుకొని అతడిని అతి కష్టమీద పట్టుకున్నారు. తల్లి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.