తెలుగుదేశం మహానాడులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అవమానం జరిగిందా? తెలుగుదేశం పార్టీ కి ఎన్నికల సమయంలో మద్దతు ప్రకటించి.. ఆ పార్టీ విజయానికి సహకరించిన పవన్ ను అవమానించారా? చంద్రబాబు, లోకేష్ బాబుల నామస్మరణతో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పవన్ విషయంలో కృతఘ్నత ప్రదర్శిస్తోందా?! ఈ విషయం గురించినే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవం జరుపుకొంటున్న మహానాడు పండగ గురించి మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగుదేశం వారు చేసుకొంటున్న ఈ పండగలో ఆధ్యాంతం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబు భజనే జరుగుతోంది. పార్టీ నేతలు వారిని ఆకాశానికెత్తేస్తున్నారు. అన్ని రకాలుగానూ వారిని కీర్తించుకొంటున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ను గుర్తు చేసుకోవాలి. మరి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకీ.. పవన్ కల్యాణ్ కు ఉన్న సంబంధం ఏమిటోప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.
ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కూడా పవర్ స్టార్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నాడు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడానికి నియోజకవర్గ స్థాయికి దిగి మరీ ప్రచారం చేశాడు పవర్ స్టార్. కాబట్టి.. ఇప్పుడు పవన్ పేరును మహానాడు కనీసం స్మరించుకోవాల్సింది. తమకు మద్దతు పలికిన జనసేన అధినేతను స్మరించుకోవాల్సింది. బాబుపై నమ్మకం ఉంచిన పవన్ ను గౌరవించుకోవాల్సింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ పని చేయలేదు! మాట మాత్రమైన పవన్ ను తలుచుకోలేదు. ఎంతసేపూ.. వారు చంద్రబాబు, లోకేష్ బాబు.. అన్నారు తప్ప.. పవన్ మద్దతు ప్రకటించిన అంశం గురించి మాట్లాడు కోలేదు. మరి ఈ పాయింట్ ను పవర్ స్టార్ అభిమానులు కూడా గమనించారు. తెలుగుదేశం పార్టీ నేతలూ బీకేర్ ఫుల్!