- సీఎం కేసీఆర్ తీరుపై ప్రజల విస్మయం
- యాదాద్రి ఆలయ పనులపై సీఎం మండిపాటు
- ప్రజా అవసరాలు పట్టించుకోవడం లేదని విమర్శ
యాదాద్రి ఆలయ ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చూపిస్తున్న శ్రద్ధ అందరికీ ఆశ్చర్యం కల్పించేలా ఉంది. నెలకోసారైనా ఈ పనులపై సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అధికారులను, ఆర్కిటెక్లను పిలిపించుకొని చర్చల మీద చర్చలు చేస్తూ పనులు శరవేగంగా పూర్తయ్యేలా చూస్తున్నారు. ఈపాటికే ఏడాదిలో మూడు నాలుగు సార్లు యాదాద్రి స్వయంగా వెళ్లి పరిశీలించి వస్తున్నారు. అయితే ఆ పనులు కూడా అన్నీ పనుల మాదిరే ఆలస్యమవుతోన్నాయి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మొన్న యాదాద్రికి వెళ్లి పనుల తీరును పరిశీలించారు. మందకొడిగా సాగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాతనైతే పనులు చేయండి.. లేదంటే వేరొకళ్లను సూస్కుంటాం.. అని మండిపడ్డారు. దగ్గరుండీ మరీ పనులు చూశారు.
అయితే ఆయన ఈ పనులపై ఇంత ఆసక్తి పెట్టిన వ్యక్తి మిగతా పనులపై ఎందుకు పెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలయ పనులు పూర్తి కాకపోవడంతో ఆయన కనబర్చిన తీరు ప్రజలకు ఉపయోగమైన పనులపై లేదని సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఏవీ ముందుకు కదలడం లేదు. ఏనాడూ జిల్లాల పర్యటన చేసినట్టు కనిపించలేదు. ఏమన్నా అంటే నలుగురైదుగురు అధికారులను పిలిపించుకొని సంబంధిత శాఖపై ఓ మూడు, నాలుగు గంటల పాటు సమీక్ష అని కూర్చొబెడతారు.. ముచ్చటిస్తారు. అంతే తర్వాత ఆ పనులు అంతే. ఈ విధంగా అన్నీ శాఖలపై ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అయితే ఊసే లేదు. ఒక్క ఆయన నియోజకవర్గం, వాళ్ల కుటుంబసభ్యుల నియోజకవర్గాల్లో తప్ప మిగతా ఎక్కడా ఆ పనుల్లో వేగం కనిపించడం లేదు. వేగమేంటి అసలు ఆ పనులు ఉన్నాయా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. చివరికి తన కూతురు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పనులు కనిపించడం లేదు. ఈ విధంగా డబుల్ బెడ్రూం పనులపై నిర్లక్ష్య వైఖరి ఉంది. ప్రజలకు అత్యవసరమైన వీటిపై శ్రద్ధ పెట్టకుండా గుళ్లు, గోపురాలపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.
ఇక వీటితో పాటు దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, మిషన్ భగీరథ, కాకతీయ, కేజీ టూ పీజీ విద్య, లక్ష ఉద్యోగాల కల్పన తదితర ముఖ్యమైన వాటిపై శ్రద్ధ పెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఆయనకు అప్రతిష్ట తెస్తున్నాయి. తమ పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లోనైతే వారికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఈ విధంగా చెబుతూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ పనులు చేయండి కాదనం.. కానీ ప్రజలకు ప్రాధాన్యమైన విషయాలపై పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.