ప్రపంచ తెలుగు మహాసభల ముగింపోత్సవానికి హాజరైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగిసింది. మంగళవారం సభలకు రాష్ట్రపతి హాజరై తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. తెలుగు భాష కీర్తిని పొగిడి వెళ్లిపోయారు. ఆ తర్వాత బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున కొలువైన హుస్సేన్సాగర్లో రామ్నాథ్ కోవింద్ పర్యటించారు.
హుస్సేన్సాగర్ అందాలను తిలకించి ఆనంద పరవశ్యానికి గురయ్యారు. ప్రత్యేక బోట్లో ప్రయాణించి హుస్సేన్సాగర్లోని బుద్ధ విగ్రహాం వద్దకు చేరుకున్నారు. బుద్ధ విగ్రహాన్ని దర్శించుకొని నివాళులర్పించారు. బౌద్ధ మతస్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హుస్సేన్సాగర్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. బుద్ధ విగ్రహ చరిత్రను అధికారులు రాష్ట్రపతికి వివరించారు. చరిత్ర విన్న రామ్నాథ్ కోవింద్ ఔరా అని కీర్తించారు. అక్కడే ఓ పది నిమిషాలు గడిపి మళ్లీ బోట్లో ఒడ్డుకు చేరుకున్నారు. అటు నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు.
అయితే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మళ్లీ రెండు, మూడు రోజుల్లో శీతకాల విడిది సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు రానున్నారు. ఓ వారం రోజుల ఉండి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.