ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటన మరవక ముందే రాజస్తాన్లో మరో మూక హత్య చోటుచేసుకుంది. తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తెను ప్రేమించిన పాపానికి ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేత్ రామ్ భీమ్ (22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో పనికి కుదిరాడు. ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో స్నేహం చేశాడు. వారి స్నేహం ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో అతన్ని పలుమార్లు యజమాని హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో అతని మృతదేహం ఓ పొలంలో దొరికింది. కేత్ రామ్ సోదరుడు హరిరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గత శుక్రవారం హయత్ఖాన్, సదామ్ ఖాన్లు వారి పోలానికి రావాలని పిలిచారని అప్పటికే పొలంలో ఉన్న మరికొందరితో కలసి అతని చేతులు కట్టేసి దారుణంగా కొట్టి చంపారని హరిరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. శవాన్ని కొంత దూరం తీసుకెళ్లి పడేయడంతో మూడు రోజులనంతరం అతని డెడ్బాడీ దొరికిందన్నారు.
ఇక పోస్ట్ మార్టం రిపోర్టులో సైతం దారుణమైన గాయాల కారణంగా కేత్ రామ్ మరణించినట్టు తేలడంతో, ఇద్దరు నిందితులనూ అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.