2019 సార్వత్రిక ఎన్నికల్లో తమిళరాజకీయం రసవత్తరంగా మారనుంది. ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఉండే పోటీ ఈసారి కనిపించడంలేదు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు కింగ్ మేకర్ అవుతారో తాజాగా రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థల తాజాగా సర్వేఫతితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసి, పేరు ఇంకా ప్రకటించని రజనీకాంత్ పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. దీంతో తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ అవుతారని సర్వే చేసిన సంస్థలు తేల్చాయి.
రజనీ పార్టీ ప్రకటించి ఎన్నికల బరిలో దిగితే తమిళనాట మిగిలిన ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని, అంతే కాకుండా దేశ రాజకీయాలపై కూడా ఆయన ప్రభావం చూపుతారని రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని 39 స్థానాల్లో 28.3 శాతం ఓట్లతో 14 స్థానాలు డీఎంకే కైవసం చేసుకుంటుందని, 13.6 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కేవలం 2 స్థానాలు సొంతం చేసుకుంటుందని, 33.7 శాతం ఓట్లతో రజనీకాంత్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకుని బలమైన పార్టీగా నిలుస్తుందని, ఇక కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని ఈ సర్వే వెల్లడించింది.