మీడియా సమావేశంలో ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను కాసింత డామినేట్ చేసిన ఒక వ్యక్తి తీరు ఆయన తీరు అందరి దృష్టిని ఆకర్సించింది. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తర్వాత నుంచి.. నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి వివరాలు అందిస్తున్న ఆయన పేరు శక్తీ కాంత్ దాస్ ఆయన ఏ క్షణంలో మీడియా సమావేశం పెడతారో.. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి.
నిన్నటి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయన బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.2వేలకు తగ్గిస్తున్నట్లుగా చెప్పారు. అదే సమయంలో ఎవరింట్లో అయినా పెళ్లిళ్లు జరుగుతుంటే.. ఇంట్లో వారంతా కలిసి అండర్ టేకింగ్ ఇవ్వటం ద్వారా రూ.2.5లక్షలు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చన్న మాటను చెప్పారు.
ఇలా వరాల్ని.. వాతల్ని పెడుతున్న ఆయన ఎవరు? ఆయనకు సంబంధించిన సంగతులేంటన్న విషయానికి వస్తే.. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న దాస్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారింగా 1980లో ఎంపికయ్యారు. ఓడిశా స్వస్థలం అయినా.. తమిళనాడు కేడర్ లో పని చేశారు. 2009లో కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అంతకు ముందు ఆయన తమిళనాడు పరిశ్రమల శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఎల్ ఐసీ.. ఓన్ జీసీ లాంటి సంస్థలకు డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. గత సెప్టెంబరు నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.