చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్బీఐ శుభవార్త అందించింది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త రూ.200 నోటు రేపే మార్కెట్లోకి వచ్చేస్తోంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో వీటిని శుక్రవారం మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది
నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు.
పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అక్రమ నగదు చెలామణీ.. నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200నోటును ముద్రిస్తున్నట్లు గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది.