హైదరాబాద్ నగర శివార్లలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా దెబ్బడగూడవద్ద వేగంగా వస్తున్న కారు, ముందు వెళ్తోన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలో కోల్పోగా ఆసుపత్రిలో మరో ఇద్దు కన్నుమూశారు.
కడ్తాల్లోని మైసిగండి దేవాలయానికి వెళ్లిన కొందరు యువకులు కారులో తిరిగి వస్తున్న సమయంలో కందుకూరు మండలం దెబ్బడగూడ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. కడ్తాల్లోని మైసిగండి దేవాలయానికి వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా, కందుకూరు దెబ్బడగూడ నేదరనూరు గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న వినోద్, నారాయణగూడ స్టేషన్లో పనిచేసే మరో కానిస్టేబుల్ శివకుమార్, తమ స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లారు. కారునడిపిన వినోద్, ముందు సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు తీవ్ర గాయాలతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ, మరో యువకుడిని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. అయితే, ఈ ఇద్దరూ చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతిచెందారు. సమాచారం అందుకున్న ఘటనాస్థలికి చేరకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.