రామేశ్వరం పోయినా శనేశ్వరుడు వదలట్లేదు అన్నట్లుగా ఉంది బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి. ఎక్కడకు వెల్లినా ఆయనను పశువుల దాణా కుంభకోనం కేసు వదలట్లేదు. పశువుల దాణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ వేసిన నాలుగు కేసుల్లోనూ ఆయనను విచారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
దీంతో ఆయనకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురు దెబ్బతగిలింది.అదే సమయంలో జార్ఖండ్ హైకోర్టు లాలూకు క్లీన్ చిట్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
సోమవారం సుప్రీంకోర్టు పనివేళలు ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ మేరకు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ఈ కేసును ’అత్యంత ప్రాధాన్యమైనది’గా భావించాలని సీబీఐ చీఫ్కు సూచించిన న్యాయస్థానం.. ఆరు నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటి విచారణను పూర్తిచేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం నాలుగు కేసులను నమోదుచేసింది. వీటిల్లో ఒక కేసుకు సంబంధించి 2013లో ట్రయల్ కోర్టు లాలూ ప్రసాద్కు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.బెయిలుపై బయటికి వచ్చిన లాలూకు 2014లో జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది.
దీనిని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు ఏర్పడతాయని అభిప్రాయపడింది. అలా జరగకుండా ఉండేందుకు లాలూ ప్రతి అభియోగంలోని కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో లాలూను దాణా కుంభకోణం మరోసారి చుట్టుకోనుంది.
Related