అవును.. అతను అనుకున్నట్లే.. ఇంట్లో కిందపడి చనిపోయిందని బంధువులను నమ్మించాడు. అంత్యక్రియలు జరుగుతుంటే ఆమె వంటిపై ఉన్నగాయాలను చూసి పలువురికి అనుమానం వచ్చింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అది హత్యగా నిర్ధారించారు. దీనికి కారణమైన మృతురాలి కొడుకును, అతడి భార్యను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్పల్లి, ఫ్రెండ్స్ కాలనీకి చెందిన బాలమణి(57) ఖైరతాబాద్లోని ట్రాన్స్కోలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఈమె కొడుకు శంకర్ (38) జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అలాగే అప్పులు కూడా చేశాడు. ఆ అప్పులను తీర్చడానికి డబ్బులు ఇవ్వాలని తన భార్య మంజుల(32)తో కలిసి గత నెల 17న తన తల్లితో గొడవ పడ్డాడు.
ఈ సమయంలో తల్లిని తోసేయడంతో ఆమె కిందపడి అపస్మారక స్థితిలోకి పోయింది. వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో తన తల్లి ఇంట్లోనే కిందపడి మృతిచెందిందని తన బంధువులను నమ్మించాడు శంకర్. తర్వాత రోజు అంత్యక్రియలు చేస్తుండగా బంధువులు, స్థానికులు బాలమణికి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీ తరలిస్తే.. అన్ని విషయాలు భయటపడ్డాయి. మృతురాలి కూతురు చంద్రకళ ఫిర్యాదు మేరకు శంకర్, మంజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.