శ్రీలంకలోని చర్చ్లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం నాడు భీకరమైన బాంబు దాడులపై శ్రీలంక రక్షణ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూజిలాండ్లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు.బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్ క్రైస్ట్చర్చ్లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. ఈ పేళుల్లో ఇప్పటి వరకు 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.
