ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ఐదు రోజుల పాటు నిర్వహించారు. తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి కృషి చేసిన వారందరినీ పిలిచి ఘనంగా సత్కరించారు. తెలంగాణ కళారూపాలు ప్రదర్శించి తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశం చాలావరకు నెలవేరినట్టు కనిపించింది. అయితే ఈ సభల నిర్వహణపై చాలా విమర్శలు వస్తున్నాయి.
సీఎం కేసీఆర్ తనకు పాఠాలు చెప్పిన గురువును పిలిపించి మహాసభల ప్రారంభం నాడే ఘనంగా సత్కరించాడు. ఆ కార్యక్రమం కేవలం అతడిని సన్మానించడానికే నిర్వహించినట్టు కనిపించిందని పలువురు పేర్కొంటున్నారు. తనకు పాఠాలు చెప్పిన గురువు మృత్యుంజయ శర్మను గుర్తు పెట్టుకున్నావ్ గానీ రాజకీయ పాఠాలు నేర్పిన గురువు, దివంగత ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును విస్మరించారని విమర్శలు వస్తున్నాయి. తెలుగు వారి కీర్తిని దేశ నలుదిశలా చాటి చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ను విస్మరణకు గురి చేశారని తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ తెలంగాణ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నిలదీశారు. చదువు చెప్పిన గురువును గుర్తించి సన్మానించావ్ గానీ రాజకీయ గురువును ఎందుకు విస్మరించావని ప్రశ్నించారు.
తెలుగు వారి నడవడిక, తెలుగు తేజస్సుకు రూపమైన నందమూరి తారక రామారావును విస్మరించడం ఏమిటని నిలదీశారు. వందల తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు ఎన్టీఆర్ను విస్మరించడంపై టీడీపీ నాయకులే కాదు సాధారణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండా అంత గొప్ప నటుడిని పట్టించుకోకపోవడంపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.