తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది . మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు .
12, 751 గ్రామాలకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత జనవరి 21న, రెండో విడత 25న, మూడో విడత ఎన్నికలు జనవరి 30న జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం నిమిత్తం మైకులు వినియోగించాలని నాగిరెడ్డి ఆదేశించారు.
తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడత 4,137 గ్రామ పంచాయతీలు, 36, 680 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మూడో విడతలో 4,115 గ్రామ పంచాయతీలు, 36,718 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చే రూ.1.5 లక్షలు వేలు మించకూడదు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.2.5లక్షలు మించకూడదు.
బ్యాలెట్ పద్దతిలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్లలెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటినుంచే ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగునుంది.