తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ నెల 29న తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్) ఆవిర్భావ సభను నిర్వహించి తీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై కోదండరామ్ మండిపడ్డారు.
తాము ఎప్పుడు సభ నిర్వహించాలని చూసినా ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. తమ సభకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామన్న టీఆర్ఎస్ ఎందుకు భయపడుతుతోందని, ఆ పార్టీ నేతల గుండెల్లో భయముందని తెలుస్తోందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన తెలిపారు.
సరూర్ నగర్ స్టేడియంలో 29న టీజేఎస్ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని.. అందుకే అనుమతివ్వడం లేదని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.