ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మరింత ఉధృతం అవుతుంది. ఇప్పుడు కొత్త రకం యూకే స్ట్రెయిన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటి వరకు యూకే స్ట్రెయిన్ రకం కేసులను 20 గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాల ప్రకటించింది. ఈ కొత్త రకం వైరస్ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను.. సంబంధిత అధికారులు వెల్లడించారు.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దాదాపు 33వేల మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరందరిని కనుగొని.. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. ఇప్పటి వరకు 114 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది. వీరి శాంపిళ్లను సార్స్ కోవ్-2 వైరస్ను గుర్తించే ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపింది.
తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఐసీఎంఆర్ సలహాదారు డా.సునీలా గార్గ్.. తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూకే నుంచి అన్ని విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేసింది భారత ప్రభుత్వం.