సాధారన, పేద, మద్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న పౌష్టికాహారం అయిన గుడ్డుకు ఇకనుంచి దూరం కానున్నారు. గుడ్డు ధర అమాంతం కొండెక్కి కూర్చుంది. ఎక్కడైనా చికెన్ రేట్లు పైన ..గుడ్డు ధరలు కింద ఉండటం చాలాసార్లు చూశాం. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
కార్తీక మాసం, అయ్యప్ప, భవానీ దీక్షల కారణంగా చాలామంది భక్తులు, వారి కుటుంబ సభ్యులు ఇటీవల కొన్నాళ్ల పాటు మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోడి మాంసం ధర కిందికి దిగింది. తిరుపతిలో కేజీ చికెన్ ధర వంద రూపాయలు కాగా, కోడి గుడ్డు ధర మాత్రం ఆకాశాన్నంటుతోంది. పేదవాడి పౌష్ఠికాహారంగా పేరొందిన గుడ్డు ధరకు రెక్కలు వచ్చాయి. గత కొంత కాలంగా నిలకడగా పెరుగుతున్న గుడ్డు ధర ఇప్పుడు ఏడు రూపాయలకు చేరింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయితే.. కేజీ చికెన్ 150 రూపాయలు పలుకుతుండగా, కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగి 7 రూపాయల నుంచి 7:50 పైసలకు చేరిందని భారత పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు రమేశ్ కత్రి తెలిపారు. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడమే గుడ్డు ధర పెరగడానికి కారణమని ఆయన తెలిపారు. మరో వైపు ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో అక్కడకు ఎక్స్పోర్టు చేయబడుతున్నాయి.
కొన్ని నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఇప్పట్లో గుడ్డు ధర కిందకు వచ్చే అవకాశం లేదనె చెప్పాలి. నష్టభయంతో రైతులు గుడ్ల ఉత్పత్తి తగ్గించారని, దీంతో 25 నుంచి 30 శాతం గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో గుడ్ల ధరలు పెరిగాయని రమేశ్ కత్రివెల్లడించారు.