అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. హెచ్-1బీ వీసాల్లో మార్పులపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి భారతీయ కంపెనీలకు షాకిచ్చినా ట్రంప్ ప్రభుత్వం… తాజాగా మరోసారి వీసా అభ్యర్థులపై బాంబు పేల్చింది.
వీసాలు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్ ను అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతిపాదించింది. ఈ విచారణలో భాగంగా అభ్యర్థులందరూ అన్ని పాస్ పోర్టు నెంబర్లను, ఐదేళ్ల విలువైన సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లను, అదేవిధంగా 15 ఏళ్ల బయోగ్రాఫికల్ సమాచారాన్ని అమెరికా వీసా అప్లయ్ చేసే ముందు సమర్పించాల్సి ఉంటుంది.
అమెరికా టెర్రర్ అటాక్స్ ను నిరోధించే అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని వెల్లడించినట్టు డాక్యుమెంట్లో పేర్కొంది. ఆ విధానంలో సోషల్ మీడియా అకౌంట్ల విచారణ కూడా ఓ భాగమని తెలిసింది. ఏడాదికి 65వేల మంది అమెరికాకు వీసాలను అప్లై చేస్తున్నట్టు స్టేట్ డిపార్ట్ మెంట్ అంచనావేసింది. ఏ ఒక్క దేశాన్నో టార్గెట్ చేసి ఈ నిబంధనలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఈ అదనపు విచారణ ప్రభావం 65వేలమందిపై చూపనుంది. వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్లు చెప్పారు.
Related
