ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. గోరఖ్పూర్ సమీపంలోని కుషీనగర్ వద్ద పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది చిన్నారులు మృతిచెందారు. వీరందరి వయసూ 10 సంవత్సరాల్లోపే. అందరూ ఖుషీనగర్ లోని డివైన్ పబ్లిక్ స్కూలు చిన్నారులే. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
25 విద్యార్థులతో డివైన్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు బేహపూర్వ సమీపంలో కాపాలదారుడు లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్యం కోసం హాస్పిటల్కు తరలించారు. మరో ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కాపలా లేని లెవల్ క్రాసింగ్ ఇదని అన్నారు. అందువల్లే దుర్ఘటన జరిగిందని, ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.
ఈ క్రాసింగ్ వద్ద గేట్ ఓ వ్యక్తిని కాపాలా ఉంచామని, రైలు వస్తున్నందున బస్సు ఆపడానికి అతడు ప్రయత్నించినా అది విఫలమైందని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని, ప్రమాదంపై దర్యాప్తు జరిపించాలని యోగి ఆదేశించారు.