ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖల్లారి మాత ఆలయం సమీపంలో రోప్వే ట్రాలీ కేబుల్ తెగిపోవడంతో కిందపడిపోయి ఒక మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
అధికారుల వివరాల ప్రకారం, మహాసముంద్ జిల్లాలోని బగ్బహ్రా ప్రాంతంలోని ఖల్లారి గ్రామంలో ఉన్న ఈ కొండపై ఆలయానికి భక్తులు నవరాత్రి సందర్భంగా దర్శనానికి వెళ్లారు. తిరిగి దిగుతున్న సమయంలో ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో రాయ్పూర్కు చెందిన 28 ఏళ్ల మహిళ అయుషి సాత్కర్ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఏడుగురిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా బాధాకరమని పేర్కొంటూ మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఖల్లారి మాతను ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
