తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్న పథకాలు, కార్యక్రమాలతో దేశ ప్రజల్లో నాలుకలా తెలంగాణ మారింది. కొన్ని ప్రత్యేక పథకాలు, చర్యలతో తెలంగాణ రాష్ట్రం పేరు మార్మోగుతోంది. మొన్న ఇవాంకా ట్రంప్ పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా బాగా హైప్ వచ్చింది. మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్రూం, ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ తదితర వాటిల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రశంసించారు. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలతో కూడా పేరు మార్మోగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అట్టహాసంగా నిర్వహించిన తెలుగు మహాసభలు అద్భుతంగా కొనసాగాయి. సభలు డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమయ్యాయి.
ప్రారంభానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. తెలంగాణను కీర్తించారు. తెలుగు భాషను గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు కొనసాగి చివరికి మంగళవారం (డిసెంబర్ 19) నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటనతో దేశం దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రపతి కూడా తెలుగులో మాట్లాడడం ఆకట్టుకుంది.
మహాసభల ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులకు మర్యాదలు, సౌకర్యాల కల్పన, వారిని గౌరవించడం తదితర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఘనంగా లభించింది. భోజనాలు, వసతి, రవాణా అన్ని సదుపాయాలు కల్పించారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు సాహో అనిపించాయి. ఆరంభం నాటి నుంచి ఐదు రోజుల పాటు ఒలంపిక్స్ క్రీడలను తలపించేలా జరిగాయి. ప్రారంభం రోజున బాణసంచా మెరుపులతో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనిపించాయి. ఇక చివరి రోజు మంగళవారం ముగింపు రోజున లేజర్ షో, బాణసంచా వెలుగులు ఆకాశానికి కొత్త రంగు తెచ్చిన మాదిరి కనిపించింది. ఒలంపిక్స్ రేంజ్లో తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలికింది.