ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎమ్మెల్యేలందరి చేత ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణం చేయించారు. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా 173మంది సభ్యులు ప్రమాణం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. మిగతా సభ్యులకు భిన్నంగా.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ప్రమాణ చేశారు.
తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన శ్రీధర్ రెడ్డి.. దైవసాక్షిగా అనకుండా.. నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణస్వీకారం చేశారు. కానీ అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రమాణ పత్రంలో ఉండే దైవ సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని మాత్రమే ప్రమాణం చేయాలి.. లేకపోతే ఆ ప్రమాణం చెల్లదు. దీంతో శ్రీధర్రెడ్డితో ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది.