తిరుపతి నుంచి హైదరాబాదు వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇందులో వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో టైరు పేలడంతో మంటలు ఏర్పడ్డాయని, దీంతో విమానాయన సిబ్బంది హుటాహుటిన విమానం వద్దకు చేరుకుని ఫైరింజిన్లతో మంటలు ఆర్పినట్లు తెలిసింది.
ఈ ప్రమాదం గురించి రోజా మాట్లాడుతూ… తాను క్షేమంగా బయటపడటానికి తిరుమల శ్రీవారి ఆశీస్సులే కారణమని, పెను ప్రమాదం తృటిలో తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రమాదం గురించి ఆమె వివరిస్తూ, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి, తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్వేపై ఆగిపోయిందని తెలిపారు. మంటలు వ్యాపించడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరం భయపడ్డామని, విమానం పేలిపోతుందేమోనని తాను అనుకున్నానని పేర్కొన్నారు.
మంటలు అదుపులోకి వచ్చిన అరగంట వరకు విమానం డోర్లు తెరవకపోవడంతో చాలా వణికిపోయానని చెప్పారు. ల్యాండయ్యే సమయంలో విమానం టైరు పేలిపోయినట్టు తెలిసిందని, మంటలు చూసి భయపడిన ప్రయాణికులు విమానం నుంచి దిగడానికి ప్రయత్నిస్తే క్యాబిన్ సిబ్బంది వద్దని వారించడంతో ఆగిపోయామని రోజా వివరించారు.