వైసీపీ ఎమ్మెల్యే రోజా రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలోని నగరిలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.
తెలుగు దేశం పార్టీ నేత, జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.