అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత చంద్రబాబుకు పెద్ద షాక్ఇచ్చారు. మూడున్నరేళ్ళ క్రితమే వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన గీత నుండి ఈ విధమైన షాక్ ఎదురవుతుందని చంద్రబాబు అసలు ఊహించి ఉండరు. బడ్జెట్ నేపథ్యలో పార్లమెంట్లో ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకోసం నిరసనలు చేస్తుంటే ఎంపీ గీత చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలో పడేశాయి.
శుక్రవారం పార్లమెంటు బయట గీత మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు అధికారపార్టీకి ఇబ్బందిగా మారాయి. ఏపికి ప్రత్యేకహోదా వచ్చేందుకు ఉన్న అర్హతలేంటని చంద్రబాబును నిలదీసారు. కేంద్ర జిడిపికన్నా రాష్ట్ర జిడిపి చాలా ఎక్కువని చంద్రబాబు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. జిడిపి ఎక్కువగా ఉందంటే రాష్ట్రం అభివృద్ధిలో ఉందన్న మాటే కదా అంటూ లాజిక్ తీశారు.
దేశ, విదేశాల నుండి లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే ఇక కేంద్రం నుండి నిధులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. పోలవరంకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పటం లేదని నిలదీశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పకపోతే మళ్ళీ కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది? అంటూ మండిపడ్డారు. విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి, వైసిపి ఎంపిలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలంతా ఒట్టి డ్రామాగా తేల్చేశారు. గీత అసలు ఆమె ఏపార్టీనో క్లారిటీ ఇస్తే బావుంటుంది.