పోలింగ్ దగ్గరపడే కొద్ది జనసేన అధ్యక్షుడు పవన్ మరింత దూకుడు పెంచారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రభివృద్దికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను సీఎం అయితే, అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని పవన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే, రాయలసీమలో వలసలను నివారిస్తామని, అందుకు గాను సౌభాగ్య రాయలసీమ పథకం ప్రారంభిస్తామని, ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు కట్టించి ఇస్తామని, సొంత మగ్గాలు లేని వారికి మగ్గాలు అందజేస్తామని హామీలు ఇచ్చారు.