తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ఎప్పుడూ ఉండేవే. తాజాగా అనంతపురం తెలుగు దేశం పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. ఇక అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన బుధవారం బహిర్గతమైంది.
అనంతపురం నగర మేయర్ స్వరూప జేసీ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జేసీపై విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడని నిప్పులు చెరిగారు. వంద కోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా నల్ల అద్దాలు పెట్టుకున్న దివాకర్రెడ్డికి కనిపించవా అని ప్రశ్నించారు. ఆయన వెంటనే నల్ల అద్దాలు తీసి తెల్ల అద్దాలు పెట్టుకోవాలని సూచించారు. చుట్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనులను కన్నెత్తి చూడకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంపీ జేసీ కేవలం తిలక్రోడ్, సూర్యనగర్ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్ ఎద్దేవా చేశారు. అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తున్న జేసీ అనంతపురం అభివృద్ధికి ఇంతవరకూ అర్ధ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడటం మాని ఇప్పటికైనా మంచి పనులుచేసి రాజకీయాలకు గుడ్బై చెబితే మంచిదని సలహా ఇచ్చారు.